తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పట్టణంలోని కేటీపీఎస్ డిఏవి స్కూల్ లో గురువారం ఘనంగా ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రిన్సిపల్ ఎ. రామారావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ సంక్రాంతి అనగా నూతన క్రాంతి అని, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారని, అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారని అన్నారు. సంక్రాంతిని మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారని, మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ అని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పండుగ యొక్క ప్రాముఖ్యత ను వివరించారు. పాఠశాలలో పల్లె వాతావరణాన్ని సృష్టించి రైతుల గొప్పదనం గురించి వివరించారు. విద్యార్ధినీ లు వేసిన రంగవల్లులు ఆకట్టుకున్నాయి. హరిదాసు వేషాలు, గంగిరెద్దు, బసవన్న వేష దారులు వేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. విద్యార్ధినీ, విద్యార్థులూ భోగి మంటల చుట్టూ చేసిన నృత్యాలు వీక్షకులను మంత్ర ముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమంలో డాన్స్ మాస్టర్ వెంకటేశ్వర్లు, కృష్ణారావు, రాజశేఖర్, సుష్మ, శేషు కుమారి, చంద్రకళ, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.