తెలంగాణ / లిబర్టీ న్యూస్ : గో రక్షకులపై దాడి చేసిన ఎంఐఎం పార్టీకి చెందిన నాయకుడిని, అతనికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం బస్ స్టాండ్ సెంటర్ వద్ద శుక్రవారం రాత్రి విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ ఖమ్మం విభాగ్ సంయోజక్ మేరుగు చింటేశ్వర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంయోజక్ కుసన సాగర్ లు మాట్లాడుతూ... ఘట్కేసర్ వద్ద గో సంరక్షకుడు సోను సింగ్ పై తుపాకీతో హత్యాయత్నం చేసిన ఎంఐఎం పార్టీకి చెందిన నాయకుడిని అరెస్టు చేయడమే కాకుండా, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గోశాలల ఏర్పాటు, నిర్వహణ, గోవుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడతామన్న ముఖ్యమంత్రి ఇప్పుడు గోవులు తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టం తీసుకురావాలని, గో సంరక్షకులకు రక్షణ కల్పించాలని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకమైన చెక్ పోస్టు లను ఏర్పాటు చేసి, గో రవాణా ను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమంగా నిర్వహిస్తున్న గోవద శాలలను వెంటనే మూసివేయాలని, ఇకపై గో సంరక్షకుల పై దాడి జరిగితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.