తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఇటీవల పోలీస్ ఇన్ ఫార్మర్ నేపంతో కొంతమంది మీడియా ప్రతినిధులతో పాటు ఇతర వృత్తులు చేసుకుంటున్న కొందరు పోలీసుల పేరు చెప్పి, నెలవారీ మామూళ్ల వసూళ్లకు తెగబడుతున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాలలో ఇసుక, మట్టి, రేషన్ డీలర్లు, రైస్ మిల్ యజమానుల వద్దకు వెళ్లి తాము ఫలానా పత్రిక/ఛానల్ లో పనిచేస్తున్నామని చెబుతూ.. పోలీస్ ఇన్ఫార్మర్ గా పరిచయం చేసుకుంటున్నారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో మేము ఎంత చెప్పితే అంత అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అనంతరం వారు చేసే వ్యాపారంలో లొసుగులు అడ్డం పెట్టుకొని పోలీసులకు చెప్పి పట్టిస్తామని బెదిరించి, నెలవారి మామూళ్లు దండుకుంటున్నారు. నెలకు సుమారు 50 వేలకు పైగా డబ్బులు వసూలు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇటీవల కాలంలో ఈ తరహా దందా పాల్వంచ పట్టణంలో ఎక్కువైందని ప్రజలు మండిపడుతున్నారు. 99% ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటామని జర్నలిజం వృత్తి లోకి వచ్చి, ఆ జర్నలిజం వృత్తికే కళంకం తెస్తున్నారంటూ ప్రజల నుండి ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. పాల్వంచలో కనీస విషయ పరిజ్ఞానం లేని కొంతమంది యువకులు సులభంగా డబ్బులు సంపాదించడానికి జర్నలిజం వృత్తిని ఎంచుకుంటున్నారు. అనంతరం ఏమి చేయాలో తెలియక, అక్రమ వసూళ్లకు దిగుతూ ప్రజల చేత, అధికారుల చేత జర్నలిజం వృత్తికి మచ్చ తెస్తూ కేసుల పాలవుతున్నారు. ఇకనైనా పోలీస్ అధికారులు స్పందించి, పోలీస్ ఇన్ ఫార్మర్ అని చెప్పుకుని తిరుగుతున్న వ్యక్తులపై నజర్ పెట్టి, కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అంటున్నారు. ఈ విషయంపై పాల్వంచ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ బాణాల రాముని వివరణ కోరగా పోలీస్ శాఖ నుండి ఎవరిని ఇన్ ఫార్మర్లుగా పెట్టుకోలేదన్నారు. ఎవరైనా పోలీసుల పేరు చెప్పి బెదిరింపులకు, వసూళ్లకు పాల్పడితే నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.