తెలంగాణ / లిబర్టీ న్యూస్ : నాగర్ కర్నూలుజిల్లా లో జరిగిన స్వేరో ఏడవ జాతీయ కన్వెన్షన్ లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన ఏరో సంస్థల అధినేత తాళ్లూరి హరిబాబు ఉత్తమ వ్యాపారవేత్త అవార్డు అందుకున్నారు. సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హరి బాబుకు ఉత్తమ వ్యాపారవేత్త పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్ని అవాంతరాలైన ఎదుర్కొని వెనకడుగు వేయకుండా హరిబాబు అంచలంచెలుగా ఎదిగిన తీరు నేటి యువతకు ఆదర్శప్రాయం అని అన్నారు. హరిబాబు తన తెలివితేటలతో అంచలంచెలుగా ఎదుగుతూ నలుగురికి ఉపాధిని చూపిస్తూ నేడు మేము ఎవరికీ తక్కువ కాదు అని నిజం చేశారన్నారు. ఒక స్వేరోగా హరిబాబు ఉత్తమ వ్యాపారవేత్త అవార్డు అందుకోవడం గర్వకారణం అన్నారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ తో తన వ్యాపారాన్ని ప్రారంభించి నేడు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నర్సింగ్ కళాశాలకు అనుమతిని తీసుకొచ్చి తన సొంత ఊరైన పాల్వంచలో నర్సింగ్ కళాశాల ప్రారంభించడం సంతోషిదాయకమని కొనియాడారు. ఈ సందర్భంగా తాళ్లూరి హరిబాబు మాట్లాడుతూ మొక్కవోని ధైర్యం వెనకడుగు వేయని పట్టుదల ఉంటే ఈ ప్రపంచంలో మనకు అసాధ్యం అంటూ ఏమీ లేదన్నారు. నేడు ఉత్తమ వ్యాపారవేత్తగా అవార్డు తీసుకోవటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. నన్ను అనుక్షణం ప్రోత్సహిస్తూ తమ విలువైన సలహాలు సూచనలు అందిస్తూ సహకరించిన సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఈ అవార్డు అందుకోవడానికి సహకరించిన మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.