తెలంగాణ / లిబర్టీ న్యూస్ : మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నేటికీ కొందరు కులమతాల కోసం కొట్టుకుని చస్తుంటారు. రక్త పాతాలకు పాల్పడుతుంటారు. ఒకరంటే ఒకరికి ద్వేషం కలిగి ఉంటారు. అయితే ప్రజలను కులమతాల పేరుతో విభజించి రాజకీయ పబ్బం గడుపుకునే పొలిటికల్ లీడర్స్ ఉన్నన్ని రోజులు ఈ దేశంలో ఈ వైషమ్యాలు తొలగిపోవని కొందరు మేధావులు చెబుతున్నారు. అయితే మనదేశంలో చాలా ఏండ్ల కిందట నుంచే హిందువులు, ముస్లిములు కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారు. ఒకరి పండుగలకు ఒకరు హాజరవడమే కాకుండా సంతోషంగా జరుపుకుంటుంటారు. అందుకు నిదర్శనమే ఈ ఘటన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని బసవతారక కాలనీ హనుమాన్ టెంపుల్ లో శనివారం అయ్యప్ప స్వామి పడిపూజ ఘనంగా నిర్వహించారు. గురు స్వామి జర్పుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఉత్సవ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పాల్వంచకు చెందిన ముస్లిం భక్తుడు ఖలీష్ కుల,మతాలకు అతీతంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించి, అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంతకుముందు కూడా నిర్వహించినట్టు తెలుస్తోంది. హిందూ,ముస్లిం భాయి భాయి అనే పదానికి ప్రతీకగా ఈ యువకుడు నిలిచాడని పాల్వంచలో ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలదారులు రాపోలు ఆనంద్, ఆకుల హరికృష్ణ, రాపోలు శ్రీశైలం, హెచ్.మధు, పజిల్, సందీప్, కిరణ్, గిరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.