తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని పుల్లాయిగూడెంకు చెందిన ఓ రైతు పొలంలో నుండి ఓ కాంట్రాక్టర్ అక్రమంగా మట్టి తోలకాలు చేస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని దిగమింగుతూ, ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కుతున్నారు. కేటిపిఎస్ ఏదో దశకు చెందిన రెండో యాష్ పాండ్ అభివృద్ధి పనుల కోసం సంస్థ 25 కోట్ల నిధులను విడుదల చేసింది. టెండర్ ద్వారా పనులు దక్కించుకున్న కావేరీ కన్స్ట్రక్షన్స్ కంపెనీ లిమిటెడ్ కాంట్రాక్టర్ గత సంవత్సరం పనులను మొదలు పెట్టారు. అగ్రిమెంట్ ప్రకారం అక్టోబర్ 2024 వరకు పనులు పూర్తి చేయాలి.. ఇంత వరకు యాభై శాతం పనులు పూర్తి కాలేదని తెలుస్తోంది. చట్టలను గౌరవిస్తూ, ప్రభుత్వ అనుమతులు తీసుకోవాల్సిన సదరు సంస్థ ఆది నుండి ఏజెన్సీ చట్టాలను, అధికారులను బేఖాతర్ చేస్తూ పనులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకానొక దశలో తాను చేస్తున్న అక్రమాలకు అధికారులు సహకరించకుంటే పనులను మద్యలోనే నిలిపివేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారనే వదంతులు పాల్వంచ వ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నాయి. యాష్ పాండ్ కు కావలసిన మట్టి తోలకాలకు, ఇసుక, కంకర సంభంధిత మైనింగ్ శాఖ అధికారుల నుండి అనుమతులు తీసుకోవాలి. అనుమతుల మేరకు మట్టి తవ్వకాలు చేపట్టాలి. కానీ సదరు గుత్తేదారు ప్రభుత్వ నిబంధనలు లెక్కచేయకుండా, అనుమతులు తీసుకోకుండా స్థానిక రైతులను మభ్యపెట్టి వారి పొలాల నుండి యధేశ్చగా మట్టి తవ్వకాలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. కోట్ల విలువైన మట్టిని యధేశ్చగా కొల్లకొడుతున్నారు. ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు దిగుతూ, పోలీస్ స్టేషన్ లో కేసులు పెడతామంటూ ... భయభ్రాంతులకు గురి చేస్తున్నారనే పుకార్లు శికార్లు చేస్తున్నాయి. అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.