తెలంగాణ / లిబర్టీ న్యూస్ : ఇది చలికాలం కాదు.. కల్తీ కాలం అన్నట్టుగా మారింది. ఎక్కడ చూసినా నకిలీ వస్తువులు, కల్తీ సరుకులే.. ఏది ముట్టుకోవాలన్నా భయం.. ఏది తినాలన్న ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా కల్తీ సరుకులకు అడ్డాగా మారింది పాల్వంచ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో డిసెంబర్ 31 సందర్భంగా పుట్టగొడుగుల్లా బిర్యానీ సెంటర్లు, కేక్ పాయింట్లు వెలిశాయి. సుమారు ఈ ఒక్కరోజే పాల్వంచ లో 100 కు పైగా బిర్యానీ, కేక్ పాయింట్ లు పుట్టుకొచ్చాయి. కనీసం ఫుడ్ బిజినెస్ పై అవగాహన లేని కొంతమంది డబ్బులకోసం కల్తీ పదార్థాలు వినియోగించి, తక్కువ ధర చూపి, బిర్యానీ, కేక్ లు అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కల్తీ, నాణ్యత లేని ఆహార పదార్థాలు విక్రయిస్తున్న వారిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.